రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం... పాలవ్యాపారి గణేశ్ కు 14 రోజుల రిమాండ్

  • గణేశ్ అనుమతులు లేకుండా డెయిరీ నిర్వహిస్తున్నాడన్న డీఎస్పీ
  • పాలు చిక్కగా కనిపించేందుకు యూరియా, డిటర్జెంట్ పొడి, నూనె వంటి పదార్దాలు కలిపి కల్తీ చేశాడని వెల్లడి
  • కల్తీ చేసిన పాలను ప్రిజ్ లో నిల్వ చేయడం వల్ల కూలెంట్ ఆయిల్ లీకై పాలు కలుషితమయ్యాయన్న డీఎస్పీ
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేత
రాజమండ్రిలో తీవ్ర విషాదం నింపిన కల్తీ పాల ఘటనలో ప్రధాన నిందితుడు, వరలక్ష్మి మిల్క్ డెయిరీ యజమాని అడ్డాల గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 

డీఎస్పీ దేవకుమార్ తెలిపిన సమాచారం ప్రకారం పాల వ్యాపారి గణేశ్ కోరుకొండ మండలం నరసాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా డెయిరీని నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు, లాభాపేక్షతో పాలల్లో నీళ్లు కలిపి ప్రజలకు పోసేవాడన్నారు. ఈ నెల 14న తక్కువగా పాలు సేకరించడం వల్ల పాలు చిక్కగా కనిపించేందుకు యూరియా, డిటర్జెంట్ పొడి, నూనె వంటి పదార్ధాలు కలిపి కల్తీ చేశాడని చెప్పారు. కల్తీ చేసిన పాలను ప్రిజ్ లో నిల్వ చేయడం వల్ల కూలెంట్ ఆయిల్ లీకై పాలు కలుషితమయ్యాయని తెలిపారు. 

కాగా, ప్రభుత్వం ప్రకటించిన విధంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. మంగళవారం కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బాధితుల కుటుంబాలను పరామర్శించి, వారికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రస్తుతం 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 
 


More Telugu News