తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం

  • 2014 నుంచి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను తుంగలో తొక్కారన్న ఆనం
  • నిబంధనలను ఐదు నెలల వ్యవధిలోనే సడలించారని విమర్శ
  • భోలేబాబా, వైష్ణవి వంటి సంస్థలు లబ్ధి పొందాయన్న మంత్రి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కల్తీ కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కడం వల్లే ఈ అపవిత్రత చోటుచేసుకుందని ఆయన విశ్లేషించారు. 


2014 నుంచి పక్కాగా సాగుతున్న ఈ-టెండర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం 2020లో పూర్తిగా నీరుగార్చిందని మంత్రి ఆరోపించారు. నెయ్యి సేకరణలో అత్యంత కఠినంగా ఉండాల్సిన నిబంధనలను కేవలం ఐదు నెలల వ్యవధిలోనే సడలించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆవు పాల ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారని ఆరోపించారు.


గత ప్రభుత్వ నిర్ణయాలు భోలేబాబా, వైష్ణవి వంటి నిర్దిష్ట డెయిరీలకు భారీగా లబ్ధి చేకూర్చాయని ఆనం వివరించారు. బిడ్డర్ల సంఖ్యను పెంచుతున్నామనే సాకుతో నిబంధనలు మార్చినప్పటికీ, వాస్తవానికి బిడ్డర్లు పెరగలేదని, కేవలం అనుభవంలేని కొన్ని సంస్థలు తక్కువ ధర కోట్ చేసి కాంట్రాక్టులు దక్కించుకునేలా మార్గం సుగమం చేశారని ఆయన విమర్శించారు.



More Telugu News