ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు.. ఖాళీల భర్తీపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

  • ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి
  • ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని హామీ 
  • శాసనమండలిలో సభ్యుడి ప్రశ్నకు సమాధానమిస్తూ కీలక ప్రకటన
  • గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించామని వెల్లడి
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దుతామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై సభ్యుడు ఏ. శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిలో అన్నింటికీ బోధన సిబ్బంది, 5 కళాశాలలకు బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా మంజూరు చేశామని వివరించారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. "నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఏ ఉపాధ్యాయుడు ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సరైన డేటా లేదు. ఆ సమాచారాన్ని సేకరించడానికే నాకు 20 నెలల సమయం పట్టింది" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి తమ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. "ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు అవసరమైన అధ్యాపకులను నియమిస్తాం. ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా అందిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. 

అలాగే ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామని, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని లోకేశ్‌ పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన మండలికి హామీ ఇచ్చారు.


More Telugu News