Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్

Revanth Reddy Government Halts ZPTC MPTC Elections in Telangana
  • తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా
  • బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూపు
  • కేంద్రం తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం
తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నందున, దానిపై స్పష్టత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిన్న‌ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్
ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుమారు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకుని మంచి జోరు మీద ఉంది. ఇదే ఊపులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం భావించింది. అయితే, ఎన్నికల హామీ అయిన బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నిర్ణయంతో స్పష్టమవుతోంది.

కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లును ఇప్పటికే కేంద్రానికి పంపామని, దానిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచిచూద్దామని మంత్రులతో అన్నట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయం తర్వాతే పరిషత్ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని, అప్పటివరకు ఆగడం మేలని సీఎం సూచించగా, మంత్రులు కూడా ఏకగ్రీవంగా అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేంత వరకు తెలంగాణలో పరిషత్ ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం లేదు.
Telangana
Revanth Reddy
Telangana ZPTC elections
Telangana MPTC elections
BC reservations
Telangana local body elections
Congress Party
Municipal elections
Telangana politics

More Telugu News