ఐఎస్ఐ కుట్ర భగ్నం.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్!

ISI Conspiracy foiled 8 Terrorists Arrested
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన పాకిస్థాన్ ఐఎస్ఐ, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు చిత్తు చేశారు. ఆదివారం చేపట్టిన మెరుపు దాడిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వెనుక విదేశీ హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీ మెట్రో పరిసరాల్లోనూ, నగరంలోని కీలక ప్రాంతాల్లోనూ కశ్మీర్ అంశంపై రెచ్చగొట్టే పోస్టర్లు వెలిశాయి. వీటిపై ఆరా తీసిన స్పెషల్ సెల్ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ పోస్టర్ల మూలాలు వెతుక్కుంటూ వెళ్లగా.. తమిళనాడులోని తిరుప్పూర్ కేంద్రంగా సాగుతున్న టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. అక్కడ గార్మెంట్ కంపెనీల్లో కార్మికులుగా నటిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని బెంగాల్‌లో పట్టుకున్నారు.

అరెస్టయిన వారిలో మిజానూర్ రెహ్మాన్, మహమ్మద్ షాబత్ సహా పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు సమాచారం. వీరంతా నకిలీ ఆధార్ కార్డులతో ఇక్కడ నివసిస్తున్నారు. వీరి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని డేటా ఆధారంగా ఈ ముఠాకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

విదేశీ గడ్డపై ఉన్న హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్‌లో భారీ ఉగ్రవాద దాడికి వీరు ప్లాన్ చేసినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను ఢిల్లీకి తరలిస్తున్నారు. వీరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ముఠా అరెస్టుతో దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
Go Back to Shorts
ISI
ISI conspiracy
Delhi Police
Terrorists arrested
Bangladesh Terrorist groups
Delhi blasts
Terror module
Tamil Nadu
West Bengal
Fake Aadhar cards

More Telugu News