చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్ర.. స్పందించిన పోలీసు అధికారి

  • ఉగ్రకుట్రల వార్తలన్నీ వదంతులే అన్న డీఐజీ
  • జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో నిజానిజాలు తెలుసుకోవాలని సూచన
  • ప్రముఖ ఛానళ్లలో ప్రచారం జరిగితే ప్రజలు భయాందోళనకు గురవుతారన్న డీఐజీ
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్రణాళికలు రచించారనే ప్రచారంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఉగ్రకుట్రల వార్తలన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐజీ శ్రీనివాస్ మాట్లాడుతూ, రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలు, కొన్ని ఛానళ్లలో చంచల్‌గూడ జైలు నుంచి ఉగ్రకుట్ర అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.

జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఏదైనా విషయాన్ని ప్రసారం చేయడానికి ముందు నిజానిజాలు ధృవీకరించుకోవాలని సూచించారు. బాధ్యతాయుతమైన మీడియా ఛానళ్లు ఇలాంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ ఛానళ్లలో ఇలాంటి వార్తలు వస్తే ప్రజలు భయాందోళనకు గురవుతారని అన్నారు. ప్రజల్లోని ఆందోళన తొలగించడానికే ఈరోజు మీడియా ముందుకు వచ్చామని అన్నారు. చంచల్‌గూడ జైల్లో లష్కరేకు చెందిన ఉగ్రవాది ఒక్కడే ఉన్నాడని తెలిపారు. అతనికి కూడా భార్యతో తప్ప ఎవరితోనూ ములాఖత్ లేదని స్పష్టం చేశారు.


More Telugu News