ట్రంప్‌కు సుప్రీంకోర్టులో షాకిచ్చింది ఆయన నియమించిన జడ్జీలే!

  • ట్రంప్ అంతర్జాతీయ సుంకాలను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు
  • 6-3 మెజారిటీతో వెలువడిన చారిత్రాత్మక తీర్పు
  • ట్రంప్ నియమించిన ఇద్దరు న్యాయమూర్తులే ఆయనకు వ్యతిరేకంగా ఓటు
  • పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని, కాంగ్రెస్‌కే ఉందని స్పష్టీకరణ
  • సుమారు 175 బిలియన్ డాలర్ల రిఫండ్ కోసం క్యూ కడుతున్న కంపెనీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఏకపక్షంగా విధించిన అంతర్జాతీయ సుంకాలను (టారిఫ్‌లు) న్యాయస్థానం కొట్టివేసింది. పన్నులు విధించే సర్వాధికారం ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడికి ఆ అధికారం లేదని 6-3 మెజారిటీతో ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. విశేషమేమిటంటే, ట్రంప్ నియమించిన న్యాయమూర్తులే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఈ తీర్పులో కీలకాంశంగా నిలిచింది.

చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని మెజారిటీ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ట్రంప్ హయాంలో నియమితులైన జడ్జీలు నీల్ గోర్సచ్, అమీ కోనీ బారెట్‌తో పాటు సోనియా సోటోమేయర్, ఎలెనా కాగన్, కేతన్జీ బ్రౌన్ జాక్సన్ మెజారిటీ తీర్పు వైపు నిలిచారు. రాజ్యాంగం ప్రకారం అధికారాల విభజన జరిగిందని, చట్టాలను రూపొందించే అధికారం కాంగ్రెస్‌దేనని వారు స్పష్టం చేశారు. మరోవైపు, ట్రంప్ చర్యను సమర్థిస్తూ బ్రెట్ కావనో, క్లారెన్స్ థామస్, శామ్యూల్ అలిటో మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఈ తీర్పుపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తనకు వ్యతిరేకంగా ఓటేసిన జడ్జీలకు దేశభక్తి లేదని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఈ తీర్పు నేపథ్యంలో గతంలో చెల్లించిన సుమారు 175 బిలియన్ డాలర్ల సుంకాలను తిరిగి పొందడానికి అమెరికన్ కంపెనీలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News