ఏది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందనుకోవద్దు: యూట్యూబర్ అన్వేశ్ పై కరాటే కల్యాణి ఫైర్

  • అన్వేశ్‌ను భారత్‌కు రప్పించి, ఆయన పాస్‌పోర్ట్ రద్దు చేయించే వరకు తన పోరాటం ఆపబోనన్న కరాటే కల్యాణి
  • యూట్యూబ్ పోతుందనే భయంతోనే అన్వేశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా
  • తన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు 'నా అన్వేషణ' అన్వేశ్‌పై సినీ నటి కరాటే కల్యాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ దేవుళ్లను, భారతదేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన అన్వేశ్‌ను భారత్‌కు రప్పించి, ఆయన పాస్‌పోర్ట్ రద్దు చేయించే వరకు తన పోరాటం ఆపబోనని ఆమె స్పష్టం చేశారు. ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావించడం సరికాదని హెచ్చరించారు. 

హైదరాబాద్‌లో నిన్న మీడియాతో మాట్లాడిన కరాటే కల్యాణి.. అన్వేశ్‌పై చట్టపరమైన చర్యల గురించి వివరించారు. హిందూ దేవతలను అవమానించారనే ఆరోపణలతోనే తాము పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, దాని ఆధారంగా కేసు నమోదై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ‘అన్వేశ్ ఎక్కడ నుంచి ప్రారంభమయ్యారో… మళ్లీ అక్కడికే రావాలన్నది’ నా లక్ష్యం అని ఆమె వ్యాఖ్యానించారు. 

ఇటీవల అన్వేశ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోవడంపై కూడా కల్యాణి స్పందించారు. యూట్యూబ్ ఛానల్ పోతే తన జీవనాధారం దెబ్బతింటుందనే భయం అన్వేశ్‌ను పట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు. అన్వేశ్‌లో ‘మేకపోతు గాంభీర్యం’ కనిపిస్తోందని విమర్శించారు. విదేశాల్లో ఉంటూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని సహించబోమని ఆమె తేల్చిచెప్పారు. 


More Telugu News