Yogi Adityanath: బాబ్రీ నిర్మాణం ఎన్నటికీ జరగదు.. యూపీ సీఎం యోగి

Yogi Adityanath Says Babri Masjid Reconstruction Will Never Happen
  • ఖయామత్ వరకు వేచి చూసినా ఉపయోగంలేదన్న సీఎం
  • అయోధ్య రామాలయంపై చెప్పింది చెప్పినట్టే చేసి చూపించామని వ్యాఖ్య
  • భారతదేశంలో సనాతన ధర్మం ఇమిడిపోయిందన్న యూపీ సీఎం
బాబ్రీ మసీదు నిర్మాణం ఇక ముగిసిన కథేనని, మసీదు పునర్నిర్మాణం ఎన్నటికీ జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేల్చిచెప్పారు. అలాంటి ఆశలు ఎవరికైనా ఉంటే తుడిచేసుకోవాలని హితవు పలికారు. ఖయామత్ (ప్రపంచం అంతమయ్యే రోజు) వచ్చే వరకూ ఎదురుచూసినా సరే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఎదురుచూసేవారు అలాగే కుళ్ళిపోతారని, కానీ అలాంటి రోజు ఎప్పటికీ రాదని ఎద్దేవా చేశారు. 

అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పాం.. చెప్పినట్లుగానే అదే చోట రాముడి గుడి కట్టామని యోగి గుర్తుచేశారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన ధర్మం ఎన్నటికీ నిలిచి ఉంటాయని చెప్పారు. భారత్ లో సనాతన ధర్మం కలగలిసిపోయిందని, వాటిని వేరు చేయాలన్న ప్రయత్నం ఎన్నటికీ నెరవేరదని అన్నారు. దేశంలో కాషాయ జెండా రెపరెపలు కొనసాగుతూనే ఉంటాయని, దేశ గౌరవాన్ని అది ఇనుమడిస్తుందని యోగి పేర్కొన్నారు. 

అయోధ్య రామాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండా ఎగరవేయడం సనాతన ధర్మానికి ప్రతీక అని కొనియాడారు. ఈ సందర్భంగా అవకాశవాదుల గురించి యోగి తన ప్రసంగంలో ప్రస్తావించారు. కొందరికి కష్టాల్లోనే రాముడు గుర్తుకు వస్తాడని, వారిని ఆ రాముడు కూడా మర్చిపోతాడని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ లో 2017 నాటి కల్లోల పరిస్థితులను ప్రస్తావిస్తూ.. అప్పట్లో ప్రతీ నాలుగైదు రోజులకు రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అల్లర్లు జరిగేవని, కర్ఫ్యూ విధించాల్సి వచ్చేదని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ నడుచుకునే వారు లబ్దిపొందుతారని, అతిక్రమించేవారు నరకానికి వెళతారని సీఎం యోగి హెచ్చరించారు. దేశంపై, సనాతన ధర్మంపై లోపలి నుంచి, బయట నుంచి దాడులు జరుగుతున్నాయని.. కొందరు కుట్రలు పన్నుతుంటే, మరికొందరు ఆ కుట్రలలో భాగంగా తమకు తాముగా అమ్ముడుపోతున్నారని యోగి ఆరోపించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Yogi Adityanath
Babri Masjid
Ayodhya Ram Mandir
Sanatana Dharma
Uttar Pradesh
Ram Temple Construction
Narendra Modi
Hinduism
India Culture
Religious Harmony

More Telugu News