ప్రపంచకప్‌లో మ్యాచ్ వదులుకుంటారా?.. గంగూలీ

  • టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్థాన్
  • పాక్ నిర్ణయం విస్మయానికి గురి చేసిందన్న గంగూలీ 
  • ప్రపంచకప్‌లో ప్రతీ పాయింట్ కీలకమని గంగూలీ వ్యాఖ్య
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ నెల‌ 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం తనను విస్మయానికి గురి చేసిందని ఆయన అన్నాడు.

ఆదివారం విలేకరులతో మాట్లాడిన గంగూలీ.. "ప్రపంచకప్ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారు? ఎలాగూ వాళ్లు శ్రీలంకలోనే ఆడుతున్నారు. పాకిస్థాన్ ఇలా వెనక్కి తగ్గడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో ప్రతీ పాయింట్ ఎంతో ముఖ్యం" అని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపై మ్యాచ్ జరుగుతున్నప్పటికీ పాకిస్థాన్ ఆడకపోవడాన్ని దాదా తప్పుబట్టాడు.

ఈ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా, టీమిండియాతో తమ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. గ్రూప్-ఏలో ఉంది. ఇదే గ్రూపులో పాకిస్థాన్‌తో పాటు నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్‌ఏ జట్లు కూడా ఉన్నాయి.


More Telugu News