మేడిపల్లిలో విషాదం: ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ బాలుడి బలవన్మరణం

  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న యువకుడు
  • విషయాన్ని అతడి స్నేహితులకు తెలియజేసిన అమ్మాయి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థి
  • తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ 17 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బోడుప్పల్‌ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివసించే ఓ ప్రైవేటు ఉద్యోగి కుమారుడు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ఈ నెల 5వ తేదీ రాత్రి బాలుడి తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు, తాను ప్రేమించిన అమ్మాయికి వీడియో కాల్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన ఆ యువతి వెంటనే అతడి స్నేహితులకు సమాచారం అందించింది.

స్నేహితులు హుటాహుటిన బాలుడి ఇంటికి చేరుకుని, అప్పటికే ఉరి వేసుకుని ఉన్న అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


More Telugu News