నన్ను ప్రశ్నించడానికి మీరెవరు? అంటూ టీచర్ చెంపపై కొట్టిన విద్యార్థి

  • గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో ఘటన
  • పరీక్ష రాయడానికి ఆలస్యంగా వచ్చాడని మందలించిన టీచర్
  • అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, బెయిల్‌పై విడుదల
పరీక్ష రాయడానికి ఆలస్యంగా వచ్చాడని మందలించినందుకు ఒక మహిళా టీచర్‌పై (పరీక్ష పర్యవేక్షకురాలు) 12వ తరగతి విద్యార్థి చేయి చేసుకున్న సంఘటన గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో జరిగింది. పరీక్ష హాలుకు ఎందుకు ఆలస్యంగా వచ్చావని టీచర్ ప్రశ్నించడంతో, "నా ఇంట్లోనే నన్ను ఎవరూ ఏమీ అడగరు. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు?" అంటూ ఆ విద్యార్థి చెంప దెబ్బ కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పంచమహల్ జిల్లాలోని షెహ్రా పట్టణంలో గల ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన జరిగిందని, ఫిబ్రవరి 3న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసు ఇన్‌స్పెక్టర్ అంకుర్ చౌదరి తెలిపారు.

నిందితుడిని 18 ఏళ్ల మొహమ్మద్ ఖాన్ అన్సారీగా గుర్తించినట్లు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, బెయిల్‌పై విడుదల అయినట్లు వెల్లడించారు. 


More Telugu News