ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

  • నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం
  • ఓటుకు నోటు కేసు వాయిస్ రికార్డింగులను నాశనం చేసే ప్రయత్నంగా కనిపిస్తోందన్న కేటీఆర్
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్న అధికారులు
హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగులను, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. 

ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందిస్తూ... ల్యాబ్ మొత్తం కాలిపోతోందని, ఏయే ఆధారాలు నాశనం చేశావు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. 

ప్రమాదం వివరాల్లోకి వెళితే... ల్యాబ్ లోని తొలి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే భవనంలోని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం కారణంగా ల్యాబ్ లోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు దెబ్బతిన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.


More Telugu News