ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు

  • టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఉత్కంఠభరిత విజ‌యం
  • నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
  • ఆఖ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్‌ను గెలిపించిన ఫహీమ్
టీ20 ప్రపంచకప్ 2026కు ఉత్కంఠభరిత ఆరంభం లభించింది. కొలంబో వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఓటమి ఖాయమనుకున్న దశలో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

148 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47) శుభారంభం అందించాడు. అయితే, ఆ తర్వాత నెదర్లాండ్స్ బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

పాకిస్థాన్ విజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఫహీమ్ అష్రాఫ్ క్రీజులో నిలిచి విధ్వంసం సృష్టించాడు. లోగాన్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో సమీకరణం పూర్తిగా మారిపోయింది. చివరి ఓవర్‌లో మరో ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఫహీమ్ కేవలం 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

అంతకుముందు పాక్ స్పిన్నర్లు నెదర్లాండ్స్‌ను 147 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టును పాక్ బౌలర్లు బెంబేలెత్తించారు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37, బాస్ డి లీడె 30 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లతో నెదర్లాండ్స్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు.  అలాగే, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ రెండేసి వికెట్లు పడగొట్టి డచ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.


More Telugu News