తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటిన పాక్ బౌల‌ర్లు.. కుప్పకూలిన నెదర్లాండ్స్

  • 147 ర‌న్స్‌కే ఆలౌటైన నెదర్లాండ్స్ జట్టు
  • పాక్‌కు 148 పరుగుల స్వ‌ల్ప‌ లక్ష్యం
  • పాక్ బౌలర్ సల్మాన్ మీర్జాకు మూడు వికెట్లు
  • నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37) టాప్ స్కోరర్
టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తా చాటారు. కొలంబో వేదికగా జరుగుతున్న‌ ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ జట్టు 147 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తమ తొలి మ్యాచ్‌లో గెలుపొందడానికి పాకిస్థాన్ ముందు కేవ‌లం 148 పరుగుల స్వ‌ల్ప‌ లక్ష్యం ఉంది.

అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ జట్టును పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా దెబ్బతీశారు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బాస్ డి లీడె 30 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లతో చెలరేగాడు. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ తన స్పెల్‌తో మ్యాచ్‌ను పూర్తిగా పాకిస్థాన్ వైపు తిప్పాడు. అతను జాక్ లయన్ కాచెట్ (9), లోగాన్ వాన్ బీక్‌లను వరుసగా ఔట్ చేసి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. వీరితో పాటు అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ కూడా రెండేసి వికెట్లు పడగొట్టి డచ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.


More Telugu News