ఆస్ట్రేలియా బాటలో భారత్.. పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం?

  • సోషల్ మీడియా వాడకానికి వయసు నిబంధన
  • డిజిటల్ వ్యసనంపై ఆర్థిక సర్వే హెచ్చరిక
  • వయసు ధ్రువీకరణ బాధ్యత ప్లాట్‌ఫామ్‌లదే
చిన్నారులను డిజిటల్ వ్యసనం నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి వయో పరిమితులు విధించే అంశంపై ప్రస్తుతం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలోని సూచనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఐసీఏఎన్ఎన్ సదస్సులో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.

ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే పిల్లల కోసం ప్రత్యేక వయో నిబంధనలు అమలు చేస్తున్నాయి. అదే తరహాలో భారత్‌లోనూ వయసు ధ్రువీకరణను తప్పనిసరి చేసే బాధ్యతను సోషల్ మీడియా సంస్థలకే అప్పగించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, హానికరమైన కంటెంట్ వల్ల చిన్నారుల మానసిక స్థితి దెబ్బతింటోందని, ఇటీవలి ఘజియాబాద్ ఘటనలే ఇందుకు ఉదాహరణని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆన్‌లైన్ టీచింగ్‌ను తగ్గించి, పిల్లలకు సులువైన విద్యా పరికరాలను అందించాలని ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా సొంతంగా వయసు నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఉండటం విశేషం. చీఫ్ ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.


More Telugu News