అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ విధ్వంసం.. రికార్డులు మోత మోగించిన భారత యువ సంచలనం

  • అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ రికార్డ్ సెంచరీ
  • 55 బంతుల్లోనే శతకం బాదిన భారత యువ బ్యాటర్
  • టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
  • భారత్ తరఫున అత్యంత వేగవంతమైన శతకం ఇదే
  • కేవలం 80 బంతుల్లో 175 ర‌న్స్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైన‌ల్‌ పోరులో ఈ యువ బ్యాటర్ రికార్డుల మోత మోగించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

ఈ క్రమంలో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 2022లో రాజ్ అంగద్ బవా 69 బంతుల్లో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 14 ఏళ్ల వైభవ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. ఇక‌, త‌న తుపాను ఇన్సింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదిన వైభవ్.. మొత్తం 80 బంతుల్లో 175 పరుగులతో ఇంగ్లంగ్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు.

ఈ భారీ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆయుష్ మాత్రే (53)తో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగులు, ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ప్ర‌స్తుతం భారత జట్టు 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో ఉంది. క్రీజులో అభిగ్యాన్ కుందు (4 బ్యాటింగ్), అంబ‌రీశ్ (7 బ్యాటింగ్) ఉన్నారు.


More Telugu News