తీహార్ జైలుకు బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్

  • చెక్ బౌన్స్ కేసులో నటుడికి ఢిల్లీ హైకోర్టు శిక్ష
  • ఈ నెల 2న లొంగిపోవాలని ఆదేశాలు
  • గడువు పెంచాలన్న రాజ్ పాల్ విజ్ఞప్తిపై ఫైర్
బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ గురువారం తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఈ నెల 2న సరెండర్ కావాలని ఆదేశించగా.. గడువు పెంచాలంటూ రాజ్ పాల్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. వెంటనే లొంగిపోవాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

చెక్ బౌన్స్ కేసు..
తమ సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్య ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ మురళీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2018లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. రాజ్ పాల్ దంపతులను దోషులుగా తేల్చింది. రాజ్ పాల్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీనిపై నటుడు అప్పీల్ చేసుకోగా 2019లో సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాజ్‌పాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు స్టే..
2024 లో ఢిల్లీ హైకోర్టు రాజ్ పాల్ కు విధించిన జైలుశిక్షపై స్టే విధించింది. రాజీ కుదుర్చుకోవాలంటూ రాజ్ పాల్ కు సూచించగా.. మురళీ ప్రాజెక్ట్స్ కు డబ్బు చెల్లిస్తానని రాజ్ పాల్ కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, ఆయన మాట నిలబెట్టుకోలేకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.


More Telugu News