భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ.. పాకిస్థాన్‌కు తప్పని సవాళ్లు

  • బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
  • ఈ నిర్ణయంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టతరం
  • గ్రూప్‌లోని ఇతర మ్యాచ్‌లన్నీ గెలవడం తప్పనిసరి
  • శ్రీలంకలో వర్ష సూచనతో పాక్‌కు మరింత పెరిగిన ఆందోళన
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల‌ 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీకి ముందు ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో సిరీస్ గెలిచి మంచి ఊపుమీదున్న పాక్, ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించడాన్ని నిరసిస్తూ, ఆ దేశానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్ల‌డించారు.

"ఇది మా నిర్ణయం కాదు. ప్రభుత్వం, పీసీబీ ఛైర్మన్ ఆదేశాలను మేము పాటిస్తాం" అని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా వ్యాఖ్యానించాడు. ఈ బహిష్కరణ నిర్ణయంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇకపై గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రూప్‌లో పాకిస్థాన్‌కు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా రూపంలో గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి. 2024 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో పాకిస్థాన్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, పటిష్ఠ‌ జట్లను ఓడించిన చరిత్ర నెదర్లాండ్స్‌కు ఉంది. దీనికి తోడు పాక్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనుండగా, అక్కడ వర్ష సూచన ఉండటం వారి ఆందోళనను మరింత పెంచుతోంది.

కొత్త కోచ్ మైక్ హెసన్ ఆధ్వర్యంలో పాకిస్థాన్ జట్టు దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మూడో స్థానంలో రాణిస్తుండగా, సయీం అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. నెమ్మది పిచ్‌లపై అనుభవం దృష్ట్యా బాబర్ ఆజం తిరిగి జట్టులోకి వచ్చాడు. శ్రీలంక పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ తమ జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. అయితే, భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం టోర్నీలో వారి ప్రయాణాన్ని ప్రమాదంలో పడేసింది.


More Telugu News