ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో షాకింగ్ ఈమెయిల్.. మైనర్ల దగ్గరకు రావాలంటూ మాజీ ప్రేయసి ఆహ్వానం!

అమెరికాను వణికిస్తున్న లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతంలో తాజాగా బయటపడ్డ ఈమెయిల్స్ సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. బాలికల అక్రమ రవాణా కేసులో 2008లో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎప్‌స్టీన్‌ను ప్రముఖులు తమ ఇంటి వేడుకలకు ఆహ్వానించినట్లు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ రికార్డులు బయటపెట్టాయి. ముఖ్యంగా ఎప్‌స్టీన్ మాజీ ప్రేయసి, మాజీ మిస్ స్వీడన్ ఏవా ఆండర్సన్ డబిన్ పంపిన ఒక ఈమెయిల్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

2010లో ఏవా డబిన్ ఎప్‌స్టీన్‌కు పంపిన మెయిల్‌లో.. "వచ్చే వారం మా ఇంటికి రా, నా కూతురు సెలీనా తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇంట్లోనే ఉంటుంది" అని పేర్కొన్నారు. అప్పటికి సెలీనా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. లైంగిక నేరగాడిగా ముద్రపడి జైలుకెళ్లి వచ్చిన వ్యక్తిని, టీనేజ్ బాలికలు ఉన్న చోటుకు ఆహ్వానించడం వెనుక ఉన్న ఉద్దేశంపై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కాకుండా, ఎప్‌స్టీన్‌ను తమ పిల్లలు 'అంకుల్ ఎఫ్' అని పిలిచేవారని, అతడితో తమ పిల్లలు గడపడం తమకు 100 శాతం ఇష్టమేనని ఆమె గతంలో తన ప్రొబేషన్ ఆఫీసర్‌కు లేఖ రాయడం గమనార్హం.

మరోవైపు, ఏవా డబిన్ దంపతులు తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. ఎప్‌స్టీన్ సాగిస్తున్న అరాచకాలు తమకు తెలియవని, తెలిస్తే తమ పిల్లలను అతడి నీడకు కూడా రానిచ్చేవారం కాదని వాదిస్తున్నారు. గతంలో ఎప్‌స్టీన్ సహచరి గిస్లాన్ మాక్స్‌వెల్ కేసులో సాక్షిగా విచారించినప్పుడు కూడా.. తనకేమీ గుర్తులేదని ఏవా దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే, ఒక క్రమశిక్షణ లేని వ్యక్తిని తమ సామాజిక సర్కిల్‌లోకి మళ్లీ ఆహ్వానించి, అతడికి 'అంకుల్' హోదా కల్పించడం వెనుక ఉన్న మర్మమేంటో తేలాల్సి ఉంది. తాజా పత్రాల విడుదల ప్రపంచ కుబేరుల అంతరంగిక జీవితాల్లోని చీకటి కోణాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.


More Telugu News