వివాహం కావడం లేదనే మనస్తాపంతో.. హుస్సేన్ సాగర్ లో దూకి యువతి ఆత్మహత్య

  • కూకట్ పల్లి పరిధిలో తల్లితో కలిసి ఉంటున్న యువతి
  • మతిస్థిమితం లేని తల్లి కారణంగా కుదరని సంబంధాలు
  • సోమవారం సాగర్ లో తేలిన యువతి మృతదేహం
మతిస్థిమితం సరిగా లేని తల్లిని విడిచిపెట్టి వివాహం చేసుకోలేక.. తల్లిని తనతోనే ఉంచుకుంటానని ఆ యువతి కండీషన్ పెట్టింది. దీంతో వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళుతున్నాయి. ఇటీవల వచ్చిన మరో సంబంధం విషయంలోనూ అలాగే జరగడంతో ఆ యువతి మనస్తాపానికి గురైంది. ఇక తనకు వివాహం కాదేమోననే వేదనతో హుస్సేన్ సాగర్ లో దూకింది. సోమవారం యువతి మృతదేహం బయటపడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

మేడ్చల్‌ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్‌ విజయలక్ష్మి(26) కూకట్ పల్లిలోని మైత్రీ నగర్ లో అద్దెకు ఉంటోంది. తండ్రి తన చిన్నతనంలోనే చనిపోగా.. మతిస్థిమితం లేని తల్లిని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఓవైపు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, మరోవైపు తల్లికి సేవలు చేస్తూ కాపాడుకుంటోంది. విజయలక్ష్మికి ఇటీవల పెళ్లి సంబంధాలు రాగా.. తల్లికి తాను తప్ప ఎవరూ లేరని, మతిస్థిమితం కూడా లేకపోవడంతో ఆమెను తానే దగ్గరుండి చూసుకుంటానని కండిషన్ పెట్టింది. దీంతో వచ్చిన సంబంధాలు ఏవీ కుదరలేదు.

ఓవైపు పెళ్లి కుదరకపోవడం, మరోవైపు తల్లి అనారోగ్యంతో విజయలక్ష్మి మనస్తాపం చెంది కఠిన నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన విజయలక్ష్మి తిరిగి రాలేదు. హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయింది. సోమవారం ఉదయం ఆమె మృతదేహం నీటిపై తేలడంతో పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి మార్చురిలో ఉంచారు. ఈలోగా విజయలక్ష్మి కనిపించడం లేదని ఆమె సమీప బంధువు అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహాన్ని అభిషేక్ కు చూపించగా.. విజయలక్ష్మిదేనని నిర్ధారించాడు.  


More Telugu News

Vijayalakshmi Vijayalakshmi suicide Hussain Sagar Hyderabad suicide marriage problems IT employee depression Kukatpally mental health Andhra Pradesh news