కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెరిగేవి, తగ్గేవి

  • కొన్ని రకాల ఔషధాలు, ఈవీ బ్యాటరీలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్ ధరల్లో తగ్గుదల
  • విదేశీ విద్య, వైద్యపరికరాలపై తగ్గనున్న భారం
  • పెరగనున్న సిగరెట్, లగ్జరీ వాచ్ లు, విదేశీ మద్యం ధరలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చేలా, దిగుమతులను నియంత్రించేలా, అదే సమయంలో డిమాండ్ పెంచేలా ఈ బడ్జెట్‌లో చర్యలు ప్రకటించారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగనుండగా, మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. 

కొన్ని రకాల మెడిసిన్ ధరలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్, తోలు, వస్త్ర పరిశ్రమ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

క్యాన్సర్, డయాబెటిస్ సహా 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. విదేశీ విద్య, వైద్య పరికరాలు, టూర్ ప్యాకేజీలపై పన్ను తగ్గింపు నేపథ్యంలో ఖర్చులో కాస్త ఊరట దక్కనుంది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ ఇన్‌పుట్‌లకు సుంకం లేని దిగుమతిని ప్రస్తుత పరిమితిని మూడు రెట్లు పెంచారు.

మైక్రోవోవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఈ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

ఆల్కాహాల్, సిగరెట్, పాన్ మసాలా వంటి హానికర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. వీటిపై అధిక ఎక్సైజ్ సుంకం విధించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తులపై విధించే సుంకం పెంచుతున్న నేపథ్యంలో వాటి ధరలు పెరగనున్నాయి. లగ్జరీ వాచ్ లు, విదేశీ మద్యం ధరలు పెరగనున్నాయి.


More Telugu News