ఎన్నారైలకు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్

  • ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని పెంచుతున్నట్లు వెల్లడి
  • డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలీడే
  • ట్యాక్స్ హాలీడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం
ఎన్నారైలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే పరిమితి పెంపునకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూలధనాన్ని ఆకర్షించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి కీలక చర్యలను ప్రకటించారు.

గతంలో భారత కంపెనీల ఈక్విటీల్లో ఎన్నారైల పెట్టుబడి పరిమితి 10 శాతం ఉండగా, ఇప్పుడు దానిని 24 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) ద్వారా లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే పరిమితిని 5 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. దీని వల్ల భారత మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి.

డేటా సెంటర్ల ఏర్పాటుపై శుభవార్త

భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2047 వరకు డేటా సెంటర్లను ఏర్పాటు చేసే సంస్థలకు ట్యాక్స్ హాలీడే ప్రకటిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ట్యాక్స్ హాలీడే నిర్ణయంతో క్లౌడ్ సేవల సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

గంటన్నర పాటు సాగిన నిర్మలా సీతారామన్ ప్రసంగం

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు గంటన్నర పాటు ఆమె ప్రసంగం సాగింది.


More Telugu News