బడ్జెట్ వేళ గ్యాస్ షాక్: కమర్షియల్ సిలిండర్‌పై రూ. 50 పెంపు!

  • హోటళ్లు, రెస్టారెంట్లకు పెరగనున్న ఖర్చులు
  • డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మాత్రం లేని మార్పు 
  • తగ్గిన విమాన ఇంధనం ధరలు
  • నేడే పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 50 మేర పెంచాయి. అయితే, గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.

తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,740.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1,844.50, ముంబైలో రూ. 1,692, చెన్నైలో రూ. 1,899.50కి చేరుకున్నాయి. గత జనవరిలో కూడా ఈ సిలిండర్లపై ఏకంగా రూ. 111 పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు నెలల పాటు ధరలు పెరగడంతో హోటళ్లు, క్యాంటీన్లు, రోడ్డు పక్కన ఉండే ఆహార దుకాణాల్లో తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఒకవైపు గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, విమాన ఇంధనం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్ ధర సుమారు రూ. 91,393కు తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల కారణంగా ఏటీఎఫ్ ధరను సుమారు ఒక శాతం వరకు తగ్గించారు. దీనివల్ల విమాన టికెట్ల ధరలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


More Telugu News