కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు... ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న విజ్ఞప్తి తిరస్కరణ

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసారి సిట్ నోటీసు
  • ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • నందినగర్ నివాసంలోనే విచారిస్తామని స్పష్టం చేసిన సిట్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా, హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరపనున్నట్లు సిట్ స్పష్టం చేసింది.

ఇటీవల గురువారం సిట్ తొలిసారి నోటీసులు జారీ చేయగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఖరారు అంశంలో బిజీగా ఉన్నందున మరో తేదీ కేటాయించాలని కేసీఆర్ కోరారు. ఇందుకు సిట్ అంగీకరించింది. అయితే, తనను ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని మాత్రం సిట్ అధికారులు తిరస్కరించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు, నందినగర్‌లోని అధికారిక నివాసంలోనే విచారణ జరపాలని నిర్ణయించి, శుక్రవారం రెండోసారి నోటీసులు అందజేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను సిట్ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది.

ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో కేసీఆర్‌ను విచారించడం కీలకమని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న విచారణ తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News