Sanjay Agarwal: సంజయ్ అగర్వాల్ కేసు.. రంగారెడ్డి, మెదక్ జిల్లాల భూములు పీఎన్‌బీకి అప్పగింత

ED Hands Over Sanjay Agarwals Assets to Punjab National Bank
షార్ట్స్‌లో చూడండి
సంచలనం సృష్టించిన ఘనశ్యామ్‌దాస్ జెమ్స్ & జ్యూవెల్స్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో అటాచ్ చేసిన ఐదు స్థిరాస్తులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి అప్పగించింది. ప్రస్తుతం ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ.16 కోట్లు ఉంటుందని ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.

ఘనశ్యామ్‌దాస్ జెమ్స్ & జ్యూవెల్స్, దాని మేనేజింగ్ పార్టనర్ సంజయ్ అగర్వాల్‌పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరిట నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సృష్టించి, వాటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో సమర్పించి నిందితులు 250 కిలోల బంగారాన్ని మోసపూరితంగా పొందారని సీబీఐ ఆరోపించింది. ఈ మోసం బయటకు పొక్కగానే సంజయ్ అగర్వాల్, అతని సోదరులు అజయ్ కుమార్, వినయ్ కుమార్ అప్రమత్తమయ్యారు. పీఎన్‌బీకి తనఖా పెట్టిన హైదరాబాద్ అబిడ్స్‌లోని తమ దుకాణంలో ఉన్న బంగారం మొత్తాన్ని స్థానిక మార్కెట్లో నగదుకు విక్రయించారు.

ఈడీ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం అమ్మగా వచ్చిన సొమ్ముతో సంజయ్ అగర్వాల్ 2012 డిసెంబర్‌లో తన భార్య పేరు మీద కొత్త సంస్థను ప్రారంభించాడు. ఆ తర్వాత తన సోదరులు, ఒక ఉద్యోగి పేర్లతో మరో మూడు సంస్థలను ఏర్పాటు చేశాడు. అతని కుటుంబ సభ్యులు, నియంత్రణలో ఉన్న సంస్థల పేర్లతో తెరిచిన పలు బ్యాంకు ఖాతాలలో భారీగా లెక్కల్లో చూపని నగదు జమ అయినట్లు ఈడీ గుర్తించింది.

ఇంతటితో ఆగకుండా సంజయ్ అగర్వాల్ 'శ్రీకాంత్ గుప్తా' అనే నకిలీ పేరుతో పాస్‌పోర్ట్ సంపాదించి, పలుమార్లు విదేశాలకు ప్రయాణించాడు. అక్రమంగా సంపాదించిన డబ్బును మళ్లించడానికి అక్కడ కూడా అనేక బ్యాంకు ఖాతాలు తెరిచాడు. దర్యాప్తును మరింత లోతుగా చేయగా, తన ఉద్యోగి అవినాష్ సోనీ పేరుతో ఒక బినామీ ఆస్తిని కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ ఆధారాలతో ఈడీ అధికారులు 2022 ఫిబ్రవరి 11న సంజయ్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. అతనికి, అతని కుటుంబ సభ్యులు, బినామీలకు చెందిన 9 స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారు.

ఈ ఆస్తుల రికవరీకి సంబంధించి కోర్టును ఆశ్రయించగా, ఐదు ఆస్తులను పీఎన్‌బీకి అప్పగించేందుకు న్యాయస్థానం అనుమతించింది. వీటిలో తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న ఒక ప్లాట్, వ్యవసాయ భూములు ఉన్నాయి. 2011లో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పుడు ఈ ఆస్తుల విలువ రూ.2.55 కోట్లు కాగా, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.16 కోట్లకు చేరడం గమనార్హం.


Go Back to Shorts
Sanjay Agarwal
Ghanshyamdas Gems and Jewels
PNB
Punjab National Bank
Money Laundering
ED
Enforcement Directorate
Rangareddy
Medak
Bank Fraud

More Telugu News