Indigo Airlines: బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Indigo Airlines Flight Emergency Landing After Bomb Threat
షార్ట్స్‌లో చూడండి
కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులతో సహా మొత్తం 186 మంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

విమానం గాల్లో ఉండగా, ఓ టిష్యూ పేపర్‌పై చేతిరాతతో ఉన్న బెదిరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. విమానాన్ని హైజాక్ చేస్తామని, బాంబు ఉందని ఆ నోట్‌లో ఉండటంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏవియేషన్ భద్రతా నిబంధనల ప్రకారం, పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి, విమానాన్ని సమీపంలోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణికులందరినీ కిందకు దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎన్.డి. నకుమ్ మాట్లాడుతూ, "తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. విమానం తనిఖీ పూర్తయింది, తదుపరి విచారణ కొనసాగుతోంది" అని వివరించారు.

అధికారులు ఈ చేతిరాత నోట్ ఎక్కడి నుంచి వచ్చింది, విమానంలోకి ఎలా చేరింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విమానం తిరిగి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల అహ్మదాబాద్‌లో పలు చోట్ల బాంబు బెదిరింపులు రాగా, అవన్నీ వట్టిదేనని తేలింది. అయినప్పటికీ, ప్రతి బెదిరింపును తీవ్రంగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Indigo Airlines
Indigo flight
bomb threat
Ahmedabad Airport
emergency landing
Kuwait to Delhi flight
flight hijack
bomb disposal squad
aviation security
ND Nakum

More Telugu News