బంగారం ధర పెరగడంతో స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయా?.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్

బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. బంగారం ధరలు పెరిగినందున రాష్ట్రంలో అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్ నగరంలో మకాం వేశాయని, చైన్ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.

దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. "నిశ్చింతగా ఉండండి. మీ భద్రత మా బాధ్యత" అని పేర్కొన్నారు.


More Telugu News