KCR: కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే: సిట్ నోటీసులపై హరీశ్ రావు ఫైర్

Harish Rao Fires Over SIT Notices to KCR in Phone Tapping Case
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, ఈ కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమని, అలాంటి నాయకుడిపై బురద చల్లాలని చూడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని వ్యాఖ్యానించారు.

పాలనలో తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీశ్ రావు కొనియాడారు. కేసీఆర్ చరిత్రను సృష్టిస్తే, ఆ చరిత్రను మలినం చేసేందుకు రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం అంతకంటే కాదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉందని, ప్రభుత్వ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.
KCR
KCR phone tapping case
Harish Rao
Revanth Reddy
Telangana politics
BRS party
Telangana self respect
Telangana government
SIT investigation
Singareni coal scam

More Telugu News