పెద్దలు అంగీకరించకపోతే... లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం: కీర్తి సురేశ్

  • 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన కీర్తి సురేశ్
  • ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోవాలనుకున్నామన్న నటి
  • తాళి కట్టే సమయంలో భర్త భావోద్వేగానికి గురయ్యాడని వెల్లడి
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ తన ప్రేమ, పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో తనది 15 ఏళ్ల ప్రేమ ప్రయాణమని, ఒకానొక దశలో తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించి ఆశ్చర్యపరిచారు.

ఇటీవల తన వివాహం గురించి మాట్లాడుతూ.. "మేమిద్దరం 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. కానీ మా పెళ్లి ఇంత ఘనంగా, అందరి ఆశీర్వాదాలతో జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఒకవేళ పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. కానీ, చివరికి మా ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు అంగీకరించడంతో గోవాలో అందరి సమక్షంలో మా వివాహం వేడుకగా జరిగింది" అని కీర్తి తెలిపారు.

పెళ్లి నాటి భావోద్వేగ క్షణాలను గుర్తుచేసుకుంటూ, ఎప్పుడూ ఎంతో ధైర్యంగా ఉండే తన భర్త ఆంటోనీ, తాళి కట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడని కీర్తి చెప్పారు. "అతడి కళ్లలో నీళ్లు చూడగానే నేను కూడా ఎమోషనల్ అయ్యాను. 15 ఏళ్ల మా నిరీక్షణ, కేవలం 30 సెకన్ల మంగళసూత్ర ధారణతో ఒక అందమైన బంధంగా మారింది. ఆ క్షణం ఒక కల నిజమైనట్లు అనిపించింది" అని ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే, వరుస సినిమాలతో కెరీర్‌లోనూ ముందుకు సాగుతున్నారు.


More Telugu News