మళ్లీ అదే తప్పు చేసిన సంజూ.. అత‌డు ఔటైన తీరుపై గవాస్కర్ అసహనం!

  • న్యూజిలాండ్‌తో టీ20లో మరోసారి విఫలమైన సంజూ శాంసన్
  • అసలు ఫుట్‌వర్క్ లేకుండా ఆడాడని సునీల్ గవాస్కర్  విమర్శ
  • సంజూ పేలవ ఫామ్‌తో టీ20 ప్రపంచకప్ స్థానంపై నీలినీడలు
  • గత నాలుగు మ్యాచుల్లో చేసింది కేవలం 40 పరుగులే
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో నిన్న‌ జరిగిన నాలుగో టీ20లో మంచి ఆరంభం లభించినా, దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో 24 పరుగులు చేసిన శాంసన్, మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, అతడు ఔటైన తీరుపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

కామెంటరీలో గవాస్కర్ మాట్లాడుతూ.. "నాకు మొదట అనిపించింది ఏంటంటే, అతడికి ఫుట్‌వర్క్ ఏమాత్రం లేదు. బంతి ఏమైనా టర్న్ అయిందో లేదో కచ్చితంగా తెలియదు. కానీ, అతను అక్కడే నిలబడి, ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు" అని విశ్లేషించాడు. 

సంజూ పదేపదే ఇదే తరహాలో ఔటవుతున్నాడని స‌న్నీ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. "చెప్పినట్టుగానే, కాళ్ల కదలిక దాదాపుగా లేదు. లెగ్-స్టంప్ బయటకు వెళ్లి, మూడు స్టంప్‌లు బౌలర్‌కు కనిపించేలా చేశాడు. అలాంటప్పుడు బంతి మిస్ అయితే బౌలర్ స్టంప్‌లను కొడతాడు. సంజూ శాంసన్‌కు ఇది రెండోసారి ఇలా జరగడం" అని గవాస్కర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. 

సంజూ వైఫల్యం.. గాల్లో టీ20 ప్రపంచకప్ బెర్త్?
ఇక‌, గత నాలుగు మ్యాచుల్లో సంజూ కేవలం 40 పరుగులే చేయడం గమనార్హం. మరోవైపు ఇషాన్ కిషన్ మూడో స్థానంలో రాణిస్తుండటంతో రానున్న టీ20 ప్రపంచకప్ జట్టులో అత‌డి స్థానంపై సందేహాలు మొదలయ్యాయి. ఈ వైఫల్యాలతో ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించడం శాంసన్‌కు కష్టంగా మారే అవకాశం ఉంది.


More Telugu News