15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎక్కడంటే..!

  • బిల్లుకు ఫ్రాన్స్‌ దిగువ సభలో సభ్యుల మద్దతు.. సెనెట్‌లో చర్చ
  • ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్న అధ్యక్షుడు మాక్రాన్
  • ఎదిగే పిల్లలపై చెడు ప్రభావాన్ని అరికట్టేందుకే నిషేధం విధించే యోచన
సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను దూరం చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ బిల్లు తీసుకొచ్చింది. ఫ్రాన్స్ దిగువ సభలో ఈ బిల్లుకు సభ్యుల మద్దతు లభించిందని, త్వరలో దీనిపై సెనేట్ లో చర్చించి చట్టంగా మారుస్తామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు.

సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో పిల్లలు నిత్యం అందులోనే మునిగితేలుతున్నారని, దీనివల్ల వారిలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. గంటల తరబడి సెల్ ఫోన్ స్క్రీన్ కు అతుక్కుపోవడం వల్ల పిల్లల్లో కంటిచూపు సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలకు గురవుతున్నారని మాక్రాన్ వివరించారు.

ఫిబ్రవరి నెలాఖరుకి సెనెట్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని, సెప్టెంబరు 1 నుంచి చట్టం అమల్లోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. 15 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి సోషల్ మీడియా కంపెనీలకు డిసెంబర్ 31 వరకు సమయం ఇస్తామని తెలిపారు.

కొత్త చట్టం ప్రకారం.. పాఠశాలల్లో పిల్లల మొబైల్ వాడకంపైనా నిషేధం ఉంటుందన్నారు. కాగా, పదహారేళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించి అమలు చేస్తోంది.


More Telugu News