టీ20 ప్రపంచకప్‌లో భారతే ఫేవరెట్.. కానీ..: రాహుల్ ద్రవిడ్

  • గత కొన్నేళ్లుగా టీ20ల్లో భారత విజయాల రేటు 80 శాతం ఉందని ప్రశంస
  • వైట్-బాల్ క్రికెట్ ఆట తీరును రోహిత్ పూర్తిగా మార్చేశాడని కొనియాడిన ద్ర‌విడ్‌
  • జట్టు టెంపో కోసం రోహిత్ తన వ్యక్తిగత గణాంకాలను పక్కనపెట్టాడని వెల్లడి
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టునే ఫేవరెట్‌గా అభివర్ణించాడు. అదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు ఆటతీరును మార్చడంలో రోహిత్ శర్మ నాయకత్వ పటిమను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు. రచయిత ఆర్. కౌశిక్ రాసిన 'ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ద్రవిడ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు 80 శాతం విజయాల రేటును కలిగి ఉంది. ఎన్నో ఒడిదొడుకులు ఉండే ఈ ఫార్మాట్‌లో ఇది అద్భుతమైన విషయం. అందుకే కచ్చితంగా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటుంది. కానీ, నా చేదు అనుభవాల నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే.. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టును రోహిత్ శర్మ కొత్త పంథాలోకి నడిపించాడని ద్రవిడ్ కొనియాడాడు. "ఒక దశలో మనం వైట్-బాల్ క్రికెట్‌లో కొంచెం వెనుకబడ్డామని, మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని భావించాం. ఈ మార్పును రోహిత్ అద్భుతంగా ముందుకు నడిపించాడు. ఇతరులను దూకుడుగా ఆడమని చెప్పడం కంటే, తానే స్వయంగా ఆ బాధ్యత తీసుకుని జట్టు టెంపోను సెట్ చేశాడు. ఒక నాయకుడు తన యావరేజ్ లేదా వ్యక్తిగత గణాంకాలను పక్కనపెట్టి జట్టు కోసం ఆడినప్పుడు, ఆ సందేశాన్ని జట్టులోకి తీసుకెళ్లడం సులభం అవుతుంది" అని ద్రవిడ్ వివరించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా రోహిత్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదని, ఇది నాయకులలో ఉండే అరుదైన లక్షణమని ద్రవిడ్ ప్రశంసించాడు.


More Telugu News