Nampalli Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Nampalli Fire Accident Telangana Govt Announces 5 Lakh Ex Gratia
  • నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
  • ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ
  • బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న‌ మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

నిన్న‌ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చా క్యాజిల్ ఫర్నిచర్ మాల్‌లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అగ్నిమాపక భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తేలిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Nampalli Fire Accident
Ponguleti Srinivasa Reddy
Hyderabad fire
Bachha Furniture Mall
Telangana government
Ex gratia
Fire safety regulations
Sriharichandana

More Telugu News