Medaram Jatara: మేడారం జాతరకు దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లు

Medaram Jatara South Central Railway Announces 28 Special Trains
  • ఈ నెల‌ 28, 29 తేదీల్లో అందుబాటులో రైల్వే ప్రత్యేక సర్వీసులు
  • వరంగల్, కాజీపేట స్టేషన్ల నుంచి ఆర్టీసీ భారీగా బస్సులు
  • రైల్వే, ఆర్టీసీ సమన్వయంతో భక్తులకు సులభతర ప్రయాణం
  • భక్తుల కోసం హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు కూడా
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు సమీపించాయి. ఈ నెల‌ 28న ప్రారంభం కానున్న ఈ మహోత్సవానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మేడారానికి నేరుగా రైలు మార్గం లేనందున, సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లయిన వరంగల్, కాజీపేటలకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల‌ 28, 29 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్‌తో పాటు నిజామాబాద్ నుంచి వరంగల్‌కు, కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం సులభతరం కానుంది.

రైళ్ల ద్వారా వరంగల్, కాజీపేట స్టేషన్లకు చేరుకున్న భక్తులు, అక్కడి నుంచి నేరుగా మేడారం గద్దెల వద్దకు వెళ్లేందుకు టీజీఎస్ఆర్‌టీసీ భారీ స్థాయిలో బస్సులను సిద్ధం చేసింది. రైల్వే స్టేషన్ల ప్రాంగణంలోనే ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి నిరంతరాయంగా బస్సులను నడుపుతారు. రైలు దిగిన వెంటనే బస్సు అందుబాటులో ఉండేలా రైల్వే, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. జాతర ముగిసే జనవరి 31 వరకు ఈ రవాణా సౌకర్యాలు కొనసాగుతాయి.

ఈసారి భ‌క్తుల‌కు అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు
ఈసారి ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. హనుమకొండ నుంచి మేడారానికి ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే, ఇందులో రానుపోను ప్రయాణానికి రూ. 35,999 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు తెలిపారు. సొంత వాహనాలు లేనివారికి, ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి రైలు, బస్సుల అనుసంధానం ఒక గొప్ప అవకాశంగా నిలుస్తోంది. ఈ ఏర్పాట్ల వల్ల భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా వనదేవతలను దర్శించుకోవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.
Medaram Jatara
Sammakka Saralamma Jatara
South Central Railway
TSRTC
Warangal
Kazipet
Telangana
Tribal Festival
Helicopter Services
Pilgrimage

More Telugu News