Nara Lokesh: మెటా గ్లోబల్ పాలసీ హెడ్ తో మంత్రి నారా లోకేశ్ భేటీ

Nara Lokesh Meets Meta Global Policy Head in Daos
  • దావోస్‌లో మెటా ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ సమావేశం
  • విశాఖలో డేటా సెంటర్ సామర్థ్యం పెంపుపై కీలక చర్చలు
  • రియాలిటీ ల్యాబ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన
  • వాట్సాప్ ద్వారా పౌరసేవలను విస్తరించాలని నిర్ణయం
  • విశాఖ ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవడమే లక్ష్యమని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, దావోస్‌లో పర్యటిస్తున్న ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. మెటా గ్లోబల్ పాలసీ విభాగాధిపతి కెవిన్ మార్టిన్‌తో ఆయన భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ అవకాశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా మూడు కీలక అంశాలపై చర్చించినట్టు మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న మెటా డేటా సెంటర్ సామర్థ్యాన్ని సంస్థ అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా భారీగా పెంచడంపై చర్చించారు. దీంతో పాటు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ భాగస్వామ్యంతో 'రియాలిటీ ల్యాబ్స్-ఫోకస్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైనా చర్చలు జరిగాయి.

అంతేకాకుండా, రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవలను మరింత విస్తృతం చేసేందుకు వాట్సాప్ ఆధారిత సేవలను పెంచాలని నిర్ణయించారు. ఈ చర్చలు ఫలప్రదంగా సాగాయని, మెటాతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. విశాఖపట్నం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో తయారీ యూనిట్లు.. పవన విద్యుత్ దిగ్గజం వెస్టాస్‌కు మంత్రి లోకేశ్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రపంచంలోనే అతిపెద్ద విండ్-టర్బైన్ల తయారీ సంస్థ అయిన వెస్టాస్‌ను కూడా మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆయన వెస్టాస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డిహోల్మ్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలప్రదంగా జరిగిందని లోకేశ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను లోకేశ్ వివరించారు. రాష్ట్రంలోని పోర్టుల సమీపంలో భారీ స్థాయిలో విండ్ టర్బైన్ బ్లేడ్లు, నెసెల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని వెస్టాస్‌ను కోరారు. ఏపీలో బలమైన పోర్టుల ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థ, పవన విద్యుత్ తయారీకి అనుకూలమైన వాతావరణం ఉన్నాయని తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రముఖ సంస్థలతో కలిసి 'సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ' ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని వివరించారు.

వెస్టాస్ సంస్థ 17.3 బిలియన్ యూరోల వార్షిక ఆదాయంతో, 68.4 బిలియన్ యూరోల ఆర్డర్ బుక్‌తో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వృద్ధి కోసం వెస్టాస్‌తో భాగస్వామ్యం కావడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
Meta
Kevin Martin
Visakhapatnam
Data Center
Ratan Tata Innovation Hub
Digital Governance
Whatsapp
Investments

More Telugu News