కాసేపట్లో సిట్ విచారణకు హాజరుకానున్న హరీశ్ రావు.. తెలంగాణ భవన్ లో కీలక భేటీ

  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ కు సిట్ నోటీసులు
  • జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరుకావాలన్న సిట్ అధికారులు
  • కేటీఆర్, ఇతర కీలక నేతలతో హరీశ్ భేటీ
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా కేసు ముందుకు సాగనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ.

ఈ క్రమంలో తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీశ్ రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన కీలక నేతలతో హరీశ్, కేటీఆర్ భేటీ అయ్యారు. మరోవైపు, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా... రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీశ్ రావును వేధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు హరీశ్ వెళ్లనున్నారు. హరీశ్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News