ట్రంప్ తీరుకు నిరసనగా గడ్డకట్టించే చలిలో గ్రీన్ లాండ్ వాసుల నిరసన
- గ్రీన్ లాండ్ అమ్మకానికి లేదంటూ నినాదాలు
- ప్రధాని సహా వేలాదిమంది ప్రజల ర్యాలీ
- ఈయూ దేశాలపై టారిఫ్ విధించడంపై మండిపాటు
ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో ‘గ్రీన్ లాండ్ అమ్మకానికి లేదు’ అంటూ నినాదాలతో జనం హోరెత్తించారు. తమ సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని గ్రీన్ లాండ్ వాసులు స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా గళమెత్తిన ఈయూ దేశాలపై టారిఫ్ లు విధించడాన్ని తప్పుబట్టారు. నూక్ జనాభాలో దాదాపు నాలుగో వంతు జనం ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.
నిరసనకారులు తమ పిల్లలను కూడా ఈ ఆందోళనకు వెంట తీసుకువచ్చారు. తమ దేశాన్ని కాపాడుకోవడం, ప్రపంచానికి తమ గొంతు వినిపించడం రేపటి తరానికి తెలియాలనే ఉద్దేశంతో పిల్లలను కూడా నిరసనలకు తీసుకొచ్చామని వారు తెలిపారు. కాగా, గ్రీన్ లాండ్ లో ఇప్పటి వరకు జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని స్థానిక పోలీసులు వెల్లడించారు.