Chandrababu Naidu: రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు... నాలుగు రోజుల పాటు ఫుల్ బిజీ!

Chandrababu Naidu to Visit Davos for World Economic Forum
  • ప్రపంచ ఆర్ధిక సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు
  • ఐబీఎం, గూగుల్, మేర్క్స్ సీఈఓలతో కీలక సమావేశాలు
  • 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
  • తొలిరోజు 20 దేశాల ఎన్నార్టీలతో డయాస్పోరా సమావేశం
ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జనవరి 18) స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో పాల్గొనేందుకు ఆయన మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఆదివారం బయల్దేరి వెళ్లనున్నారు. జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు.

ఆదివారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి జ్యూరిచ్‌కు ముఖ్యమంత్రి పయనం కానున్నారు. జనవరి 19న ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిశోర్ లుల్లా, ఆయన బృందంతో భేటీ అవుతారు. 

పర్యటనలో తొలి ముఖ్య కార్యక్రమంగా, జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. సుమారు 20 దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగువారిని (ఎన్నార్టీలు) ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. 

దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్ధిక, పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎంతో భేటీ కానున్నారు. ప్రముఖ విదేశీ మీడియా సంస్థ ‘పొలిటికో’కు చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

టెక్ దిగ్గజాలతో కీలక చర్చలు

పర్యటనలో రెండో రోజు అత్యంత కీలకంగా జరగనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించే 'ఇండియా ఎట్ సెంటర్: జియోగ్రఫీ, గ్రోత్ - ఏపీ అడ్వాంటేజ్' అనే బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్రంలోని అవకాశాలను వివరిస్తారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఇండియా లాంజ్'ను ప్రారంభిస్తారు. 

ఆ తర్వాత టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థలైన ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌లతో చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. 

అదే రోజు ఇజ్రాయెల్ ఆర్ధిక, పారిశ్రామిక మంత్రి నిర్ బర్కత్‌తో, స్విట్జర్లాండ్ ఆర్ధిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి హెలెన్ బడ్లిజెర్ అర్టెడాతోనూ చర్చలు జరుపుతారు. ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్‌మండ్‌తో పాటు, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తోనూ సమావేశమవుతారు. రాష్ట్రంలో పోర్టులు, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి అత్యంత కీలకమైన అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ ఏపీ మోలర్-మేర్స్క్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్‌తో ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ ముఖాముఖి సమావేశం కానున్నారు.

వివిధ అంశాలపై చర్చా వేదికల్లో ప్రసంగాలు

మూడో రోజు పర్యటనలో భాగంగా, 'హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్' అనే అంశంపై జరిగే చర్చా కార్యక్రమంలో, బ్లూమ్‌బెర్గ్ సంస్థ నిర్వహించే 'ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్: ఏఐ మూమెంట్ ట్రాన్స్‌ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ' సెషన్‌లో ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. పారిశ్రామిక పురోగతి, వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ వంటి అంశాలపై జరిగే పలు సెషన్లలో కూడా ఆయన పాల్గొంటారు. ఏపీ లాంజ్‌లో కేంద్ర మంత్రులతో కలిసి 'బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్' కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

మొత్తంగా ఈ నాలుగు రోజుల పర్యటనలో 3 ప్రభుత్వాల మధ్య సమావేశాలు, 16 మంది పారిశ్రామికవేత్తలతో వన్-టు-వన్ భేటీలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో ఒక కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. 

ఇక జనవరి 22న దావోస్ నుంచి బయల్దేరి, 23వ తేదీ ఉదయం 8:25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Davos
World Economic Forum
AP investments
Nara Lokesh
UAE
Tech investments
Artificial Intelligence
Telugu diaspora

More Telugu News