Revanth Reddy: ఆర్మీ, ప్రభుత్వం మధ్య సమస్యలు.. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్మీ అధికారులతో భేటీ

Revanth Reddy Chairs Meeting with Army Officials on Issues
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్
  • రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ-ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ, ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ, ప్రభుత్వం మధ్య భూసమస్యలు, ఇతర పరిపాలనాపరమైన అంశాల పరిష్కారంపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆర్మీ ఉన్నతాధికారులకు పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో సైనిక్ స్కూలును ఏర్పాటు చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు గత పదేళ్లలో రెండు అంతకుమించి సైనిక్ స్కూళ్లు వచ్చాయని, కానీ తెలంగాణకు ఈ కాలంలో ఒక్కటి కూడా మంజూరు చేయలేదని గుర్తు చేశారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, ఇందులో భాగంగా వికారాబాద్‌లో లో-ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం కోసం ఆర్మీ వైపు నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తే చర్చలు జరపడం సులభమవుతుందని అన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షించారు.
Revanth Reddy
Telangana
Army
Civil Military Liaison Conference
Hyderabad
Land Issues
Defense

More Telugu News