Virat Kohli: కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఏం జరుగుతోంది..? క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్
- కోహ్లీ, గంభీర్ మధ్య సంబంధాలు సరిగా లేవంటూ రూమర్లు
- అలాంటిది ఏమీ లేదని చెప్పిన సితాన్షు కోటక్
- కోహ్లీ, రోహిత్ ఇద్దరూ గంభీర్ తో రెగ్యులర్ గా మాట్లాడతారని వెల్లడి
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గురించి సోషల్ మీడియాలో రోజూ ఊహాగానాలు, రూమర్లు వస్తుండటం మనకు తెలిసిందే. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాలు సరిగా లేవని, ఇద్దరూ మాట్లాడుకోరని ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పుడు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
న్యూజిలాండ్తో ఈరోజు జరుగుతున్న రెండో వన్డే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో సితాన్షు మాట్లాడుతూ... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ గౌతమ్ గంభీర్తో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారని తెలిపాడు. జట్టు ప్రణాళికలు, వన్డే ఫార్మాట్, మ్యాచ్ ల గురించి, 2027 ప్రపంచ కప్ గురించి చర్చిస్తారని చెప్పాడు. "నేను వాళ్లతోనే ఉంటాను. వారి మాటలు వింటుంటా. ఇద్దరూ వారి అనుభవాలను షేర్ చేస్తారు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తాయి. అవేమీ మేం పెద్దగా పట్టించుకోం" అని స్పష్టంగా చెప్పాడు.
రోహిత్, విరాట్ ఇద్దరూ ఇప్పుడు ఒకే ఫార్మాట్ (ODI)లో ఆడుతున్నారు కాబట్టి ప్రతి మ్యాచ్లో భారత్ గెలవాలని కోరుకుంటారని, వాళ్ల అనుభవం జట్టుకు బాగా ఉపయోగపడుతుందని కోటక్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు చూసి ఆశ్చర్యపోవద్దని క్రికెట్ అభిమానులకు సూచించాడు.