జార్ఖండ్‌లో దారుణం: పశువుల దొంగతనం నెపంతో వ్యక్తిపై మూకదాడి.. హత్య!

Pappu Ansari Lynched in Jharkhand Over Cattle Theft Suspicion
జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో పశువుల దొంగతనం అనుమానంతో 45 ఏళ్ల పప్పు అన్సారీ అనే వ్యక్తిని అల్లరి మూక దారుణంగా కొట్టి చంపింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కలకలం రేపింది.రాణిపూర్ గ్రామానికి చెందిన పప్పు అన్సారీ పశువుల రవాణా వ్యాపారం చేస్తుంటాడు. బీహార్‌లోని శ్యామ్ బజార్ పశువుల సంత నుంచి తిరిగి వస్తుండగా 20-25 మంది వ్యక్తులు అతడి వాహనాన్ని ఆపి దాడికి దిగారు. బాధితుడి సోదరుడు నసీమ్ కథనం ప్రకారం.. నిందితులు పప్పు అన్సారీని వివస్త్రను చేసి, అతడు ముస్లిం అని తెలుసుకున్న తర్వాతే గొడ్డళ్లు, బాణాలతో దాడి చేశారు. "నా సోదరుడిని ముస్లిం అని తిడుతూ, గొడ్డలితో తల పగలగొట్టి చంపారు. ముస్లిం కావడం ఈ దేశంలో నేరమా?" అని నసీమ్ కన్నీటిపర్యంతమయ్యాడు. మరుసటి రోజు ఉదయం మతిహాని, లత్తా గ్రామాల మధ్య పొలాల్లో పప్పు మృతదేహం లభ్యమైంది.

పోలీసు రికార్డుల ప్రకారం మృతుడిపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని డీఎస్పీ జేపీఎన్ చౌదరి తెలిపారు. అయితే, తన సోదరుడి వద్ద పశువుల రవాణాకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలు ఉన్నాయని, దొంగతనానికి అతడికి ఎలాంటి సంబంధం లేదని పప్పు బావ ఫుర్కాన్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై జార్ఖండ్ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ స్పందిస్తూ.. "ఇలాంటి విద్వేష బీజాలు ఎవరు నాటుతున్నారు?" అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి హామీ ఇచ్చారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Go Back to Shorts
Pappu Ansari
Jharkhand lynching
cattle theft
Godda district
mob violence
communal violence
Hemant Soren
Irfan Ansari
crime
India

More Telugu News