నవీ ముంబైలో హర్మన్ ప్రీత్, నాట్ షివర్ పరుగుల విధ్వంసం

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ సివర్-బ్రంట్ (70) అద్భుత హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ పోరులో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే ఓపెనర్ అమేలియా కెర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నాట్ సివర్-బ్రంట్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. చూడచక్కని బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. కేవలం 46 బంతుల్లో 13 బౌండరీలతో 70 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తోడవడంతో ముంబై స్కోరు వేగం పుంజుకుంది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

సివర్ ఔటైన తర్వాత హర్మన్‌ప్రీత్ అసలు సిసలైన విధ్వంసం సృష్టించింది. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో అజేయంగా 74 పరుగులు చేసింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాది జట్టు స్కోరును 195 పరుగులకు చేర్చింది. నికోలా కేరీ (21) కూడా విలువైన పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు తేలిపోగా, అరంగేట్ర బౌలర్ నందిని శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. బౌలర్ల వైఫల్యంతో ఢిల్లీ ముందు ముంబై భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Harmanpreet Kaur
Mumbai Indians
WPL 2026
Womens Premier League
Nat Sciver Brunt
Delhi Capitals
DY Patil Stadium
womens cricket
cricket

More Telugu News