Himachal Pradesh bus accident: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం... 12 మంది మృతి

Himachal Pradesh Bus Accident 12 Dead
  • హిమాచల్ ప్రదేశ్‌లో 200 మీటర్ల లోతైన లోయలో పడిన ప్రైవేట్ బస్సు
  • ప్రమాదంలో 12 మంది మృతి, 33 మందికి గాయాలు
  • పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
  • ఘటనపై విచారణకు ఆదేశించిన హిమాచల్ ప్రభుత్వం
హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. సిమ్లా నుంచి కుప్వీకి వెళుతున్న ఈ బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా 'పోష్' పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు తిరిగి వెళుతున్నారు. హరిపుర్‌ధార్ మార్కెట్‌కు సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా బస్సు రోడ్డుపై నుంచి జారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని నాహన్, రాజ్‌గఢ్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం సిమ్లాలోని ఐజీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది. 
Himachal Pradesh bus accident
Himachal Pradesh
bus accident
Sirmaur district
road accident
Kupvi
दुर्घटना
Himachal Pradesh road accident
India road accident
Sukvinder Singh Sukhu

More Telugu News