జ్యోతిరాదిత్య సింధియా 31 ఏళ్ల కుమారుడి కాళ్లకు నమస్కరించిన 73 ఏళ్ల బీజేపీ ఎమ్మెల్యే

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు, 31 ఏళ్ల మహార్యమన్ సింధియా పాదాలను బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర కుమార్ జైన్ (73) తాకుతున్న వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. శివపురి ఎమ్మెల్యే దేవేంద్ర, తన కంటే 42 సంవత్సరాలు చిన్నవాడైన మహార్యమన్ పాదాలను తాకుతున్నట్లు 11 సెకన్ల వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్, శివపురి జిల్లా స్టేడియంలో 69వ జాతీయ పాఠశాల క్రీడల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఆయన కుమారుడు మహార్యమాన్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవేంద్ర కుమార్ జైన్ కూడా హాజరయ్యారు.

అదే రోజున దేవేంద్ర పుట్టినరోజు కావడంతో వేడుక నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. పక్కనే ఉన్న మహార్యమాన్ చప్పట్లు కొడుతూ, ఆ తర్వాత దేవేంద్రకు కేక్ తినిపిస్తూ కనిపించారు. అనంతరం దేవేంద్ర వంగి మహార్యమన్ సింధియా కాళ్లను తాకారు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో దేవేంద్ర స్పందిస్తూ, వయస్సులో మహార్యమాన్ చిన్నవాడైనప్పటికీ గౌరవంతో ఆయన కాళ్లను తాకానని, తాను అలా చేయడంలో ఎలాంటి తప్పులేదని సమర్థించుకున్నారు.

Jyotiraditya Scindia
Mahanaaryaman Scindia
Devendra Kumar Jain
BJP MLA
Madhya Pradesh

More Telugu News