Suresh Pasi: నాకు ముస్లింల ఓట్లు అవసరం లేదు: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Suresh Pasi Says He Does Not Need Muslim Votes
  • ఎప్పుడూ ముస్లింల ఇళ్లకు వెళ్లి ఓట్లు అడగలేదని, భవిష్యత్తులో అడగబోనని వ్యాఖ్య
  • ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, బీజేపీకి సంబంధం లేదన్న సురేశ్ పాసి
  • సురేశ్ పాసి వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదన్న బీజేపీ అధ్యక్షుడు శుక్లా
బీజేపీ సీనియర్ నాయకుడు, జగదీశ్‌పూర్ శాసనసభ్యుడు సురేశ్ పాసి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముస్లింల ఓట్లు తనకు అవసరం లేదని ఆయన పేర్కొనడం వివాదాస్పదమైంది. తాను ఎప్పుడూ ముస్లింల ఇళ్లకు వెళ్లి ఓట్లు అభ్యర్థించలేదని, ఇక ముందు కూడా వారి ఓట్లు అడగబోనని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, తాను గతంలో ఎప్పుడూ మసీదులను సందర్శించలేదని, భవిష్యత్తులోనూ వెళ్లబోనని ఆయన తేల్చి చెప్పారు. వారి ఓట్లు అడగనని, వారి సుఖదుఃఖాలలో కూడా పాలుపంచుకోబోనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆయన అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాంశు శుక్లా స్పందిస్తూ, సురేశ్ పాసి వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. "సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" అనే నినాదంతో తాము ముందుకెళతామని, సురేశ్ పాసి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఆయన పేర్కొన్నారు.

ఓట్ల కోసం ముస్లింల ఇళ్లకు తాను వెళ్లబోనన్న సురేష్ పాసి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమేథి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నాయకులు ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఓట్ల కోసం ప్రజల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇదంతా ఒక రాజకీయ నాటకమని ఆయన మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అమేథీ జిల్లా అధ్యక్షుడు రామ్ ఉదిత్ యాదవ్ సైతం స్పందించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమని ఆయన విమర్శించారు. రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడమే బీజేపీ రాజకీయమని, ఓట్ల కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆయన ధ్వజమెత్తారు.
Suresh Pasi
BJP
Muslim votes
Jagdishpur
Amethi
politics
India politics
controversial statement

More Telugu News