Imran Khan: పాకిస్థాన్‌లో 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు

Pakistan Court Sentences YouTubers to Life Imprisonment
షార్ట్స్‌లో చూడండి
 పాకిస్థాన్‌లో యాంటీ-టెర్రరిజం కోర్టు (ఏటీసీ) సంచలన తీర్పు వెలువరించింది. ‘డిజిటల్ టెర్రరిజం’ ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నిందితులంతా విదేశాల్లో నివసిస్తుండటంతో, వారి గైర్హాజరీలోనే ఇస్లామాబాద్ ఏటీసీ న్యాయమూర్తి తాహిర్ అబ్బాస్ సిప్రా శుక్రవారం ఈ తీర్పును ప్రకటించారు.

శిక్ష పడిన వారిలో ప్రముఖ జర్నలిస్టులు వజహత్ సయీద్ ఖాన్, సాబిర్ షకీర్, షాహీన్ సెహబాయ్, మోయీద్ పీర్జాదాతో పాటు యూట్యూబర్లు ఆదిల్ రాజా, హైదర్ రజా మెహదీ, మాజీ సైనికాధికారి సయ్యద్ అక్బర్ హుస్సేన్ ఉన్నారు. ప్రతి ఒక్కరికీ రెండు యావజ్జీవ శిక్షలతో పాటు అదనంగా 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, భారీ జరిమానాలు విధించారు.

2023 మే 9న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో నిందితులు తమ ఆన్‌లైన్ ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రభుత్వ, సైనిక సంస్థలపై దాడులకు ప్రజలను ప్రేరేపించారని, సమాజంలో భయాందోళనలు సృష్టించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, వారి చర్యలు ‘డిజిటల్ టెర్రరిజం’ పరిధిలోకి వస్తాయని పేర్కొంది.

పాకిస్థాన్‌పై యుద్ధం చేయడం, నేరపూరిత కుట్ర వంటి తీవ్రమైన అభియోగాల కింద వీరిపై ఇస్లామాబాద్‌లోని రామ్నా, అబ్పారా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే, యాంటీ-టెర్రరిజం కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.
 
Go Back to Shorts
Imran Khan
Pakistan
YouTubers
Life Imprisonment
Terrorism
Journalists
Military
Social Media
Cybercrime
Pakistan Army

More Telugu News