YSRCP: నంద్యాలలో వైసీపీకి షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత

PV Pradeep Reddy Joins TDP in Nandyala Giving Shock to YSRCP
  • టీడీపీలో చేరిన పీవీ ప్రదీప్ రెడ్డి
  • మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి ప్రదీప్ రెడ్డి ముఖ్య అనుచరుడు
  • గతంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా బాధ్యతలు
  • ఈ చేరికతో పార్టీ బలోపేతమైందని టీడీపీ వర్గాల ధీమా
నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన పార్టీ మారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సమక్షంలో ప్రదీప్ రెడ్డి పసుపు కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. గతంలో వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా సమర్థవంతంగా నడిపించిన ప్రదీప్ రెడ్డి, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తి టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య విలువలకు టీడీపీ కట్టుబడి ఉందని, ప్రజల సమస్యలపై ఆ పార్టీ చేస్తున్న పోరాటం తనను ఆకర్షించిందని తెలిపారు. నంద్యాల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ చేరికతో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రదీప్ రెడ్డి చేరికతో వైసీపీలోని మరికొందరు అసంతృప్త నేతలు టీడీపీ వైపు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
YSRCP
PV Pradeep Reddy
Nandyala
TDP
Shilpa Ravi Reddy
NMD Firoz
Andhra Pradesh Politics
Telugu Desam Party
Social Media Incharge
Political Defection

More Telugu News