మలక్‌పేటలో రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతుల మృతి

  • బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన బస్సు
  • ట్యాంక్‌బండ్‌కు వెళ్తుండగా మూసారాంబాగ్ సమీపంలో ఘటన
  • మృతులు సూర్యాపేట జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహేద్ నగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల కొత్తపేటలోని తమ కుమార్తె ఇంటికి వచ్చారు. నిన్న సాయంత్రం వీరిద్దరూ ద్విచక్రవాహనంపై ట్యాంక్‌బండ్‌కు బయలుదేరారు.

మూసారాంబాగ్ హైటెక్ మోటార్స్ సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు కింద పడిపోగా, బస్సు వెనుక చక్రాలు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న మలక్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News