Harish Rao: సమయం సరిపోదు... 15 రోజులు కావాలి: హరీశ్ రావు

Harish Rao Demands 15 Days of Assembly Sessions
  • బీఏసీ సమావేశానికి హాజరైన హరీశ్ రావు
  • రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్య
  • వారం రోజుల్లో అన్ని సమస్యలపై చర్చించడం సాధ్యం కాదన్న హరీశ్
  • అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలని సూచన 

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. సభ నిర్వహణపై ప్రభుత్వం ముందు ఆయన పలు కీలక డిమాండ్లు ఉంచారు. ముఖ్యంగా ప్రజల సమస్యలను విస్తృతంగా చర్చించాలంటే అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజుల పాటు జరగాల్సిందేనని ఆయన అన్నారు.


బీఏసీ సమావేశం అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ సమగ్రంగా చర్చించాలంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేసిందన్నారు. కేవలం వారం రోజుల్లోనే అన్ని అంశాలపై చర్చించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మూడు లేదా నాలుగు రోజుల్లో సభను ముగించడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


మరోవైపు, ప్రస్తుతానికి ఒక వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, సమావేశాల సమయంలో పరిస్థితులను బట్టి అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించే అంశంపై మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హరీశ్ రావు వెల్లడించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఎన్ని రోజులు జరుగుతాయన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.


ఇదిలా ఉండగా, నదీ జలాల అంశంపై సభలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. ఈ అంశంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తమకూ అదే అవకాశం ఇవ్వాలని బీఏసీ సమావేశంలో డిమాండ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నీటి ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వివరించేందుకు తమకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని హరీశ్ కోరారు.

Harish Rao
Telangana Assembly
Assembly meetings
BRS Party
Telangana politics
Public issues
River waters
BAC meeting
Winter sessions
Telangana government

More Telugu News